Sunday, March 30, 2008

రాష్ట్ర విభజన శ్రేయస్కరమా? ఆన్‌లైన్ ద్వారా ఇటా సర్వే

యాహూ తెలుగు వెబ్ సైట్ ...
చెన్నై (ఏజెన్సీ), శనివారం, 29 మార్చి 2008 ( 13:07 IST )
రాష్ట్రాన్ని మూడుగా విభజించడం శ్రేయస్కరమేనా అనే అంశంపై ఆన్‌లైన్ ద్వారా ప్రజాభిప్రాయం సేకరించనున్నట్టు ఇండియన్ తెలుగు అసోసియేషన్ ప్రకటించింది. రాజకీయ నేతలు తమ అభిప్రాయాలను ప్రజాభిప్రాయాలుగా చెబుతున్నందున తాము ఈ అభిప్రాయ సేకరణ జరపాలని నిర్ణయించామని తెలిపింది.

ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు నగేశ్ చెన్నైలో ఓ ప్రకటన విడుదల చేస్తూ తమ వెబ్‌సైట్ www.indiantelugu.com లో ప్రవేశించడం ద్వారా ఈ అభిప్రాయ సేకరణలో పాల్గొనవచ్చన్నారు. మైక్రోపోల్ ద్వారా నిర్వహిస్తున్న ఈ పోల్ ఫలితాన్ని మే1న విడుదల చేస్తామని వెల్లడించారు.

తెలుగు వారు ఎక్కడ నివసిస్తున్నారనే విషయంతో నిమిత్తం లేకుండా వారి అభిప్రాయాలను సేకరించేలా ఈ సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎవర్నీ ఇబ్బంది పెట్టాలనే ఉద్ధేశంతో తాము ఈ అభిప్రాయ సేకరణ జరపడం లేదన్నారు.

రాష్ట్ర విభజనపై ఐటీఏ ప్రజాభిప్రాయ సేకరణ

(ఎంఎస్ఎన్ తెలుగు వెబ్ సైట్ వార్త)
ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశం వేడెక్కుతున్న నేపథ్యంలో చెన్నై నగరం నుంచి తెలుగువారికి సాహితీ, సాంస్కృతిక సేవలందించే ఇండియన్ తెలుగు అసోసియేషన్ (ఐటీఏ) ఆన్‌లైన్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ దిశగా నడుం బిగించింది.

ఐటీఏ వ్యవస్థాపక అధ్యక్షులు నగేష్ స్పందిస్తూ ఐదు దశాబ్దాలకు పైగా అనుబంధాలతో పెనవేసుకుపోయిన రాష్ట్ర ప్రజలు విభజన అంశంపై తమ మనోభావాలను స్పష్టంగా వెల్లడించాల్సిన తరుణం ఆసన్నమైందని భావిస్తున్నామన్నారు. ఈ క్రమంలో తమ సంస్థ అధికారిక వెబ్‌సైట్ అయిన www.indiantelugu.com ద్వారా ఆన్‌లైన్‌లో ప్రజాభిప్రాయ సేకరణకు రంగం సిద్ధం చేసినట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రజలు సహా దేశవిదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులందరూ ఈ వెబ్‌సైట్ ద్వారా ఓటింగ్‌లో పాల్గొని తమ అభిమతాన్ని స్పష్టం చేయవచ్చన్నారు. మే 1వ తేదీన పత్రికా ముఖంగా ఓటింగ్ ఫలితాలను ప్రకటిస్తామని నగేష్ చెప్పారు.

Saturday, March 29, 2008

ఇండియన్ తెలుగు అసోసియేషన్

ప్రపంచంలోని తెలుగువారందరినీ ఏకం చేసే లక్ష్యంతో చెన్నైలో ఈ తెలుగు సంస్థ ప్రారంభమైంది. ఐటీఏ అని కూడా వ్యవహరించే ఈ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షునిగా నగేష్, వ్యవస్థాపక కార్యదర్శిగా సుకుమార్ ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రతి ఏటా తెలుగు ఉగాది వేడుకలు, సంక్రాంతి సంబరాలు, తెలుగు తేజం పురస్కార ప్రదానం వంటి వినూత్న, విశిష్ఠ కార్యక్రమాలతో ఐటీఏ ఎంతో పేరు ప్రతిష్ఠలు ఆర్జించింది. ఈ సంస్థ కార్యకలాపాలను గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి www.indiantelugu.com వీక్షించండి